బషీర్బాగ్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి, పథకాన్ని కొనసాగించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీనికోసం జులై 8న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉన్నత విద్యలో ప్రవేశాలకు అమలు చేస్తున్న 10 వేల ర్యాంకు నిబంధనను తొలగించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ రద్దయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. పథకాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొందరు అధికారులు సీఎంను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పథకం రద్దుకు ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
