- బీసీల లెక్కలు తీయాల్సిందే
- త్వరలోనే తెలుగు రాష్ట్రాల బంద్ నిర్వహిస్తామన్న అఖిలపక్ష, బీసీ సంఘాల నేతలు
- 1931 దాకా లెక్కబెట్టి ఇప్పుడెందుకు తీయరన్న కోదండరాం
- బీసీలను బిచ్చగాళ్లలా చూస్తున్రు: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, వెలుగు: జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా బీసీల లెక్కలు తీయాల్సిందేనని అఖిలపక్షాలు, బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే తెలుగు రాష్ట్రాల బంద్ను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన అఖిలపక్షాలు, బీసీ, కుల సంఘాల సమావేశం జరిగింది. ప్రత్యేకంగా బీసీలను లెక్కించబోమంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం బాధాకరమని, బీసీలను లెక్కిస్తే వారికి ఎంతో ఉపయోగమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 1931 వరకు బీసీల లెక్కలు తీశారని, ఇప్పుడు మాత్రం ఎందుకు తీయరని ప్రశ్నించారు. బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాల్లాగా, బిచ్చగాళ్లలాగా చూస్తున్నారంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. జనాభా లెక్కల్లో బీసీలు ఎందరున్నారో చెప్పేందుకు కేంద్రానికొచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఒక్కో బీసీకి బిస్కెట్లు కూడా రావని విమర్శించారు. దీనిపై దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తామూ ఈ దేశ బిడ్డలమేనని, తమకూ హక్కులుంటాయని చెప్పారు. అన్ని రంగాలనూ ప్రైవేట్పరం చేసి రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తానుగానీ యువకుడిగా ఉండుంటే గన్నుపట్టుకుని పార్లమెంట్పై దాడి చేసేవాడినన్నారు. బీసీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అనేది ఓ దుర్మార్గమైన వ్యవస్థ అని పీసీసీ సీనియర్వైస్ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. వెంటనే దాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ వాళ్ల విభజించు, పాలించు అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. బీసీలను లెక్కబెట్టకుంటే తిరుగుబాటు వస్తుందని, రక్తపాతాలు జరుగుతాయని హెచ్చరించారు.