హైదరాబాద్, వెలుగు: కొట్టేసిన బైక్లపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న డిగ్రీ స్టూడెంట్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన గ్యార హృదయ్ విశాల్ అలియాస్ చిన్ను(21) డిగ్రీ ఫైనలియర్ చదువుతూ హయత్నగర్లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన విశాల్ ఈజీ మనీ కోసం తన ఫ్రెండ్తో కలిసి చైన్ స్నాచింగ్స్ మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి బైక్లు కొట్టేసి వాటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు. ఈ ఏడాది మార్చిలో 4 బైక్ లు కొట్టేసి వాటిపై తిరుగుతూ వరుసగా స్నాచింగ్స్ చేశారు. రూరల్ ఏరియాలు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేశారు.
వరుస చోరీలు..
హృదయ్ విశాల్, అతడి ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఈ ఏడాది మార్చి 2న మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఓ బైక్ను కొట్టేశారు. మార్చి 3న ఆ బైక్పై బీబీనగర్ మండలం కొండమడుగుకు వెళ్లి చైన్ స్నాచింగ్ చేశారు. తర్వాత బైక్ను అక్కడే వదిలేసి పారిపోయారు. 4న మలక్పేటలో ఓ బైక్ చోరీ చేసి.. 5న మళ్లీ బీబీనగర్ వెళ్లి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. ఆ బైక్ను ఘట్కేసర్ శివారులో వదిలేశారు. తర్వాత ఘట్కేసర్లోనే ఓ బైక్ చోరీ చేసి 9న బీబీనగర్లోని గూడురులో చైన్ స్నాచింగ్చేశారు. అక్కడి నుంచి జనగామకు వెళ్లారు. అక్కడి రైల్వేస్టేషన్లో బైక్ చోరీ చేసి దానిపై తిరుగుతూ స్నాచింగ్కు యత్నించి విఫలమయ్యారు. దీంతో బైక్ను అక్కడే వదిలి సిటీకి వచ్చేశారు.
మణప్పురంలో తాకట్టు పెట్టి వాటాలు
వీరిద్దరు కలిసి దొంగిలించిన బంగారాన్ని మణప్పురం గోల్డ్లో తాకట్టు పెట్టేవారు. వచ్చిన డబ్బును పంచుకునేవారు. తర్వాత జల్సాలు చేసేవారు. ఆ డబ్బు అయిపోగానే మళ్లీ బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు. మేడిపల్లి, పీర్జాదిగూడ, బీబీనగర్, ఘట్కేసర్లో జరిగిన వరుస చైన్ స్నాచింగ్స్పై మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి ఎస్వోటీ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్, బైక్ నంబర్ల ఆధారంగా స్నాచింగ్లకు పాల్పడింది హృదయ్ విశాల్గా గుర్తించారు. సోమవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీపీ చౌహాన్ తెలిపారు. పరారీలో ఉన్న మరో స్నాచర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.