టెర్రరిస్టుల సొరంగాలను గుర్తించేందుకు ఏర్పాటు
జమ్మూ: లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) వెంబడి రాడార్తో కూడిన డ్రోన్లను బీఎస్ఎఫ్ మోహరించింది. జమ్మూ రీజియన్లో ఇండియా, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్లోకి ఎంటరయ్యేందుకు టెర్రరిస్టులు ఉపయోగించే టన్నెల్స్ను గుర్తించేందుకు తొలిసారిగా వీటిని ఏర్పాటు చేసింది. ‘‘టెర్రరిస్టులు ఇండియా భూభాగంలోకి చొరబడకుండా, జమ్మూకాశ్మీర్లో లేదా దేశంలోని ఏ ప్రాంతంలోనూ దాడులు చేయకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా.. అండర్గ్రౌండ్ టన్నెల్స్ను గుర్తించేందుకు దేశీయంగా తయారైన సాంకేతిక పరికరాన్ని ఇటీవల ఉపయోగంలోకి తెచ్చాం. భూమి కింద ఉన్న సొరంగాల ఉనికిని గుర్తించడానికి, వాటి పొడవును మ్యాప్ చేయడానికి బలమైన రేడియో తరంగాలను రాడార్లు రిలీజ్ చేస్తాయి. బలగాలు చేరుకోవడానికి కష్టతరమైన ఏరియాల్లో మెరుగైన యాక్సెస్ను పొందేందుకు డ్రోన్లపై రాడార్లను ఉంచాం’’ అని ఆఫీసర్లు తెలిపారు. బీఎస్ఎఫ్కు చెందిన యాంటీ టన్నెలింగ్ సర్వైలెన్స్ బృందాలు కూంబింగ్కు వెళ్లినప్పుడు.. రాడార్లు అమర్చిన డ్రోన్లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సెర్చ్ చేస్తారు. కాగా, ఈ డ్రోన్లతో ఇప్పటికే మందులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రవాణా చేసేందుకు ఉపయోగించారు.
5 అండర్గ్రౌండ్ టన్నెల్స్ గుర్తింపు
జమ్మూ దగ్గర్లో ఇప్పటికే ఐదు అండర్గ్రౌండ్ టన్నెల్స్ను బీఎస్ఎఫ్ గుర్తించింది. వీటిలో 2020, 2021, 2022లో మూడు క్రాస్ బార్డర్ టన్నెల్స్ను కనుగొన్నది.