- మోడీ సర్కారుకు మళ్లీ సుప్రీం క్లీన్చిట్
- గత తీర్పుపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత
- డీల్పై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదన్న సీజేఐ బెంచ్
- కొనుగోలు నిర్ణయం, ప్రక్రియ, ఆఫ్సెట్ పార్ట్నర్ అంశాల్లో అవినీతి జరిగిందనడానికి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోళ్లకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించుకుంది. ఈ డీల్లో అవినీతి, అవకతవకలు జరిగాయనడానికి, అందులో ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవనిమరోసారి స్పష్టం చేసింది. రక్షణ శాఖ, ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ మధ్య కుదిరిన డీల్ సరైందేనంటూ గత డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను గురువారం కొట్టేసింది. ఈ వ్యవహారంలో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదుచేసి, డీల్పై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేనేలేదని సీజేఐ బెంచ్ పేర్కొంది. తాజా తీర్పుతో మోడీ సర్కారుకు రెండోసారి క్లీన్చిట్ లభించినట్లయింది. అనిల్ అంబానీకి ప్రయోజనం చేకూర్చేలా రక్షణ శాఖను ఓవర్టేక్ చేసిమరీ ప్రధాని కార్యాలయం(పీఎంవో) డీల్లో జోక్యం చేసుకుందంటూ ‘ది హిందూ’ పత్రిక రాసిన కథనాల్ని ఆధారంగా చూపుతూ, పాత తీర్పును సమీక్షించాలంటూ మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్శౌరీ, లాయర్ ప్రశాంత్ భూషణ్, వినీత్ ధండా ఏప్రిల్లో రివ్యూ పిటిషన్లు వేశారు. వీటిని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన బెంచ్ విచారించి, తీర్పు వెల్లడించింది.
తీర్పులో ఎం చెప్పారంటే..
ముగ్గురు జడ్జిలు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కాపీలో ఇలా రాశారు.. ‘‘రాఫెల్ డీల్కు సంబంధించి పిటిషనర్లు ప్రధానంగా మూడు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. డీల్పై నిర్ణయం, డీల్ జరిగిన ప్రక్రియ, ఆఫ్సెట్ పార్ట్నర్గా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎయిరోస్పేస్ టెక్నాలజీని ఎంపిక చేయడంలో అక్రమాలు జరిగాయని వాదించారు. యుద్ధవిమానాల కొనుగోళ్లు దేశరక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ మూడు అంశాల్లో కోర్టు జోక్యం పరిమితంగా ఉంటుంది. పైగా ఈ డీల్ ప్రపోజల్ చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉంటూ వచ్చింది. కేవలం ఆర్టికల్ 32 కింద దాఖలు చేశారు కాబట్టే రివ్యూ పిటిషన్ను విచారణకు స్వీకరించాం. సుమారు 60వేల కోట్ల విలువైన రాఫెల్డీల్పై కోర్టుకు కేంద్రం ఇచ్చిన రిపోర్టులో ఒకవేళ తప్పులు ఉండుంటే కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించేవాళ్లం. కానీ అసలు దర్యాప్తే జరగకుండా, పిటిషనర్లందరూ తమకుతామే అప్పీలేట్ అథారిటీగా ఫీలయిపోయి, కోర్టు కూడా అలానే భావించాలని కోరుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. కొత్తగా వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా, రాఫెల్ డీల్లోని ఒక్కో క్లాజును పరిశీలించి, అందరి వాదనలూ విని, టెక్నికల్ అంశాల ఆధారంగా ఇంతకుముందిచ్చిన తీర్పును రివ్యూ చేయాలనడం ఏమాత్రం కరెక్ట్కాదని నిర్ణయించాం”అని జడ్జిలు పేర్కొన్నారు.
ఆపిల్, బత్తాయి ఒక్కటికాదు
యూపీఏ హయాంలోని డీల్తో పోల్చుకుంటే మోడీ సర్కార్ కుదుర్చుకున్న డీల్లో ఎయిర్క్రాఫ్ట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న వాదనను సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది. ‘‘కేంద్రం ఇచ్చిన రిపోర్టు, అందుబాటులో ఉన్న ఇంకొంత సమాచారం ఆధారంగా ఎయిర్క్రాఫ్ట్ ధరల విషయంలో నూటికి నూరుశాతం సంతృప్తి చెందాం. కొంతమంది వ్యక్తుల అనుమానాలను తీర్చడం మా పని కాదు. ఎయిర్క్రాఫ్ట్ ధరలకు సంబంధించి సంబంధిత శాఖల్లోని ఇంటర్నల్ మెకానిజం కావాల్సినన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటుంది. పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లు చూశాక.. ఆపిల్ పండుతో బత్తాయి పండును పోల్చిచూడమన్నట్లుంది. నిజానికి పాత డీల్ కంటే కొత్త డీల్లోనే ఎయిర్క్రాఫ్ట్ల ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. విమానం ఎలాంటి లోడ్ను మోసుకెళ్లాలి? రేటు ఎంతుండాలి? అనే విషయాల్ని అధికారుల విచక్షణకే వదిలేయాలి. డీల్పై రక్షణ శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ వెల్లడించిన అభిప్రాయాలు(డిసెంట్ నోట్స్) రిపోర్టులో పొందుపర్చకపోవడం పెద్ద విషయం కాదు’’ అని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది.