
హైదరాబాద్, వెలుగు: రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ తన డిఫెన్స్, ప్రొపల్షన్ టెక్నాలజీలను ప్యారిస్లో జరుగుతున్న 55వ అంతర్జాతీయ ఎయిర్ షోలో ఆవిష్కరించింది. వీటిలో స్వదేశీ మైక్రోటర్బో ఇంజన్ల నుంచి అత్యధిక పనితీరు కనబరిచే కామికాజ్ డ్రోన్ల వరకు ఉన్నాయి. తమ అంతర్జాతీయ విస్తరణ వ్యూహం, రక్షణ రంగంలో భారతదేశ స్వయంసమృద్ధి సామర్థ్యాలకు ఇవి నిదర్శనమని తెలిపింది.
అంతర్జాతీయ విమానయాన తయారీదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రఘువంశీ సంస్థ తాజాగా అమెరికాలో సైరకూజ్లో 40 ఏళ్లుగా విమానయాన తయారీ రంగంలో ఉన్న డబ్ల్యుఎంటీ ప్రెసిషన్ ఎల్ఎల్సీ అనే కంపెనీని టేకోవర్ చేసింది. ఆ కంపెనీ కోలిన్స్, పార్కర్, హనీవెల్ లాంటి సంస్థలకు ఇంధన నాజిల్స్ తయారు చేస్తుంది.
ఈ టేకోవర్తో ఉత్తర అమెరికా మార్కెట్లో ఎదిగామని రఘువంశీ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో యూకేకు చెందిన పీఎంసీ గ్రూపును కూడా టేకోవర్ చేశామని పేర్కొంది. తద్వారా చమురు, సహజవాయు రంగాల్లోకి అడుగుపెట్టింది.