కోల్ కతా: ఆస్ట్రేలియాలో మరో ఎనిమిది నెలల్లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ కాంబినేషన్పై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్లు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. టీమ్ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు తాను క్లియర్ గా ఉన్నట్లు వెల్లడించాడు. నిరుడు జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిముఖం పట్టడంతో ఈ సారి టీమ్ కాంబినేషన్ పక్కాగా ఉండాలని బీసీసీఐ, మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే టైమ్లో రవిశాస్త్రి ప్లేస్ లో వచ్చిన ద్రవిడ్కు ఈ మెగా టోర్నీ రూపంలో బిగ్ చాలెంజ్ ఎదురుకానుంది. ఈ టోర్నీలో టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే రోహిత్ తో కలిసి చర్చించినట్లు ద్రవిడ్ తెలిపాడు. ‘మెగాటోర్నీకి ఎలా రెడీ అవ్వాలనే విషయమై, రోహిత్, సెలెక్టర్లు, మేనేజ్మెంట్ తో పాటు నాకు ఓ క్లియర్ ఐడియా ఉంది. ఈ విషయంలో ఫలానా ఫార్ములా అంటూ ఏమీ లేదు. కానీ ఆ టోర్నీలో టీమ్ బ్యాలెన్స్, కాంబినేషన్ పై మేం క్లారిటీగా ఉన్నాం. ప్రతి ప్లేయర్ వర్క్ లోడ్ ను గమనిస్తూ అందుకోసం ప్లాన్ చేసుకుంటున్నాం. కేవలం15 మంది ప్లేయర్స్ కే పరిమితం కావాలని అనుకోవట్లేదు. వరల్డ్ కప్ టీమ్లో ప్లేస్ ఆశిస్తున్న యంగ్ స్టర్స్ అందరికీ వారి టాలెంట్ను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. వరల్డ్ కప్ టైమ్కు వారు 15 నుంచి 20 మ్యాచ్లు ఆడే అవకాశముంటుంది. వారితో కలిసి ఆడేందుకు, వారి పొజిషన్స్ తెలుసుకునేందుకు రోహిత్ కు ఇది యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా గాయపడితే కొంత మంది బ్యాకప్ ప్లేయర్లు కూడా అవసరం ఉంటుంది’ అని విండీస్తో థర్డ్ టీ20 అనంతరం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
ఒక్క మ్యాచ్తో అంచనా వేయలేం..
ఒక్క మ్యాచ్, సిరీస్తో ఇషాన్, రుతురాజ్ లాంటి యంగ్స్టర్స్ టాలెంట్ను అంచనా వేయలేమని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ‘నిలకడగా రన్స్ చేసేందుకు వాళ్లకు వీలైనన్ని అవకాశాలు ఇస్తాం. అలాగని ప్రతీ ప్లేయర్కు ఇన్నే మ్యాచ్ల్లో చాన్స్ ఇస్తామని చెప్పలేం. టీమ్లోకి వచ్చే కొత్త ప్లేయర్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం’ అని యంగ్ స్టర్స్ కు హెడ్ కోచ్ భరోసా ఇచ్చాడు. ఇక, ఆల్రౌండర్ వెంకటేశ్ బాగా ఆడుతున్నాడని ద్రవిడ్ చెప్పాడు. క్లిష్టమైన ప్లేస్లో ఆడే చాలెంజ్ తనకు అప్పజెప్పామని, ప్రతీ మ్యాచ్కూ తను బెటర్మెంట్ చూపించడం బాగుందన్నాడు.
సౌతాఫ్రికాలో ఓటమి బాధించింది
నిరుడు న్యూజిలాండ్ తో సిరీస్ సమయంలో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ ఈ నెల 17న కోచ్ గా 100 రోజులు పూర్తి చేసుకున్నాడు. ఈ జర్నీపై ద్రవిడ్ స్పందించాడు. ‘ఈ వంద రోజుల్లో నేను చాలా నేర్చుకున్నా. రిజల్ట్ గురించి ఎక్కువగా ప్రెజర్కు గురికాలేదు. టీమ్ ను బెటర్ గా తయారు చేస్తూ సరైన దిశలో ముందుకు సాగేలా చేయడంపైనే దృష్టి పెట్టా. సౌతాఫ్రికా టూర్ మాకు ఓ గుణపాఠం. అక్కడ టెస్టు, వన్డే సిరీస్ ఓడిపోవడం బాధ కలిగించింది. కానీ ఒక కోచ్గా రోజూ మరింత మెరుగయ్యేందుకే ప్రయత్నిస్తా. తప్పులు చేయకూడదని అనుకోను. నేనూ తప్పులు చేస్తుంటా. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ప్రతిరోజూ ఇంప్రూవ్ అవ్వాలనే చూస్తా’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
సాహా అంటే గౌరవం ఉంది
సౌతాఫ్రికా సిరీస్ టైమ్లో తనను ద్రవిడ్ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని సూచించినట్లు సీనియర్ కీపర్ సాహా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించిన ద్రవిడ్.. సాహా కామెంట్స్ తనను బాధించలేదన్నాడు. ‘ఇండియాకు సేవలందించిన సాహా పట్ల నాకు గౌరవం ఉంది. అయితే టీమ్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయాన్నే అతనితో చర్చించా. పంత్ ఇప్పటికే నంబర్ వన్ కీపర్ గా ఎదుగుతున్నాడు. అతడికి బ్యాకప్ గా మేనేజ్ మెంట్ యంగ్ కీపర్ (కేఎస్ భరత్) వైపు చూస్తోందని సాహాతో చెప్పా. అంతమాత్రాన నాకు సాహాపై గౌరవం లేనట్లు కాదు. ఇలాంటి విషయాల్లో ప్లేయర్స్ తో మాట్లాడకుండా ఉండటం నాకు తేలికైన విషయం. కానీ నేను అలాంటి వాడిని కాదు. వారు ఈ నిజాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని ద్రవిడ్ తెలిపాడు.