టీమ్ ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. టీ-20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండేందుకు రాహుల్ ద్రవిడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాత్రి దుబాయ్ వేదికగా చెన్నై, కోల్ కతా మధ్య IPL ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషా.. ద్రవిడ్ తో ప్రత్యేంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెడ్ కోచ్ గా ఉండేందుకు ద్రవిడ్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. 2023 వరకు రెండేళ్ల పాటు కోచ్ గా ఉండటానికి ఓకే చెప్పారు.
ప్రస్తుతం NCA హెడ్ గా కొనసాగుతున్న ద్రవిడ్ త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఆ తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, బౌలింగ్ కోచ్ గా పరాస్ మామ్ బ్రేను తీసుకోనున్నారు. మరోవైపు బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్ కొనసాగే వీలుండగా.. ఫీల్డింగ్ కోచ్ గా ఆర్ .శ్రీధర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్ -19 స్థాయిలో ద్రవిడ్ పర్యవేక్షణలోనే సూపర్ స్టార్స్ గా నిలిచారు. వారంతా ప్రస్తుతం టీమిండియాలోనూ మెరుస్తున్నారు.
ఈ టీ-20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తోంది. మరోవైపు ద్రవిడ్ రీసెంట్ గా శ్రీలంక పర్యటనలోనూ టీమ్ ఇండియా కోచ్ గా సేవలందించారు.