జనం ఇచ్చిన ఇల్లు ఇది.. ఖాళీ చేసే సమయంలో రాహుల్ భావోద్వేగం

జనం ఇచ్చిన ఇల్లు ఇది.. ఖాళీ చేసే సమయంలో రాహుల్ భావోద్వేగం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వర్గానికి పరువునష్టం కలిగించే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారని కేసు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. అనంతరం ఆయన పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దయింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లోని 12వ నెంబర్ బంగళాలోని ఆయన వస్తువులన్నింటికీ ఒక ట్రక్‌లో తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

18 ఏళ్లు ఆ బంగ్లాలోనే..


లోక్‭సభ సభ్యత్వంపై వేటు పడడంతో ఎట్టకేలకు తన అధికారిక నివాసాన్ని కీలక నేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‭లో ఉన్న ఆ భవనంలో రాహుల్ 2005 నుంచి ఉంటున్నారు.అయితే ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది.  గడువు ముగియడంతో శనివారం (ఏప్రిల్ 22) తన బంగళాను రాహుల్ ఖాళీ చేశారు. 18 ఏళ్ల పాటు ఆ బంగళాలో ఉన్న రాహుల్ గాంధీ.. మొదటి సారి అక్కడి నుంచి బయటికి వెళ్లారు. అయితే బంగళా తాళాలను లోక్‌సభ హౌసింగ్ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది..

పరువునష్టం కేసులో  ఎంపీ సభ్యత్వం రద్దు

పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీకి 2023 మార్చి నెలలో పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దయింది. దీంతో ఈ బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు అధికారులు.  తల్లి సోనియాగాంధీ అధికారిక నివాసం 10 జనపథ్లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. గత కొన్ని రోజులుగా రాహుల్‌ ఉపయోగించే సామగ్రిని సోనియా గాంధీ ఇంటికి తరలించారు. ఇదిలా ఉంటే ఇక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీకి తమ ఇంట్లో చోటు ఇస్తామంటే, తమ ఇంట్లో ఇస్తామంటూ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆఫర్లు చేశారు. అయితే రాహుల్ గాంధీ.. సెంట్రల్ ఢిల్లీలోని 10 జనపథ్‌లో ఉన్న తన తల్లి సోనియా గాంధీ బంగ్లాకు మారనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ మీద భారతీయ జనతా పార్టీ ప్రతీకారం తీర్చుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ఎంపీ హోదాలో బంగ్లా కేటాయింపు


ఏప్రిల్ 14న రాహుల్ గాంధీ తన కార్యాలయంలోని  వ్యక్తిగత వస్తువులను బంగ్లా నుంచి తీసుకెళ్లిపోయారు. శుక్రవారం (ఏప్రిల్ 21)సాయంత్రం బంగ్లాలో మిగిలిపోయిన వస్తువులను రాహుల్ గాంధీ తీసుకెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎంపీ హోదాలో ఆయనకు బంగ్లా కేటాయించారు. తమ వస్తువులతో ఓ ట్రక్కు భవనం నుంచి వెళ్లిపోవడం కనిపించింది.రాహుల్ గాంధీ తన కార్యాలయానికి స్థలాన్ని వెతుకుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'మోదీ ఇంటిపేరు'కు సంబంధించిన కేసులో ఈ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఎంపీ పదవిపై కూడా అనర్హత వేటు పడింది. అందుకే ఏప్రిల్ 22లోగా ఈ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు వచ్చాయి.

రాహుల్ కు లోక్సభ సెక్రటేరియట్ నోటీసులు


మార్చి 23న సూరత్ కోర్టు పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎంపీ పదవికి అనర్హుడయ్యారు. సూరత్ సెషన్స్ కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బే తగిలింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై వచ్చే వారం గుజరాత్ హైకోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది. అనర్హత వేటు పడిన మరుసటి రోజే ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. 2004లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో వయనాడ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు