భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాను కేసులకు భయపడనని, తనపై వీలైనన్ని ఎక్కువ కేసులు పెట్టండని చెప్పారు. బార్పేట జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర 7వ రోజు తన మొదటి బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్... సీఎం హిమంత బిశ్వశర్మపై విరుచుకుపడ్డారు. దేశంలోని అత్యంత అవినీతి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అని ఆరోపించారు.
అంతేకాకుండా హిమంత బిశ్వ శర్మ అమిత్ షా కంట్రోల్ ఉన్నాడన్న రాహుల్.. అమిత్ షాకు గనుక వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే శర్మను పార్టీలో నుంచి గెంటేస్తారని చెప్పారు. కేసులు పెట్టి నన్ను భయపెట్టగలనన్న ఆలోచన హిమంత బిశ్వ శర్మకు ఎలా వచ్చిందో నాకు తెలియదు.. వీలైనన్ని కేసులు పెట్టండి.. మరో 25 కేసులు పెట్టండి.. నన్ను బెదిరించలేరు.. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు నన్ను బెదిరించలేవు అని రాహుల్ అన్నారు.
అస్సాం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచిపెట్టేయాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ చూస్తున్నాయన్నారు రాహుల్.. వారు అస్సాంను నాగపూర్ నుండి నడపాలని అనుకుంటున్నారు. కానీ మేం దానిని అనుమతించమని చెప్పారు. జోడో న్యాయ యాత్రకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఆటంకాలు కలిగించినా.. అనుకున్న మార్గంలోనే యాత్ర ముందుకు సాగుతుందని స్పస్టం చేశారు రాహుల్.
అంతకుముందు రాహుల్ గాంధీతో పాటుగా ఇతర నేతలపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.