కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేసును అస్సాం పోలీసులు రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. జనవరి 23న గౌహతిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సమగ్రమైన, లోతైన దర్యాప్తు కోసం సీఐడీకి బదిలీ చేసినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. రాహుల్ గాంధీతో పాటుగా మరో కొంతమంది కాంగ్రెస్ నాయకులపై తొమ్మిది ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా దానిని సీఐడీకి బదిలీ చేశారు.
అస్సాం రాజధాని గువాహటి బార్డర్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు గువాహటి సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించగా.. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లీడర్లు వాటిని పక్కకు తోసేసి సిటీలోకి దూసుకెళ్లేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లీడర్లు, పోలీసులు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తాము యాత్రను అడ్డుకోవడం లేదని, రూట్ మార్చాల్సిందిగా సూచించామని సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని, లోయర్ అస్సాం నుంచి యాత్రను కొనసాగించాలని చెప్తే.. ప్రజలను రాహుల్ రెచ్చగొడ్తున్నారని మండిపడ్డారు. అందుకే, రాహుల్పై కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా డీజీపీని ఆదేశించినట్టు తెలిపారు.
రాహుల్ గాంధీ రాష్ట్రంలోని ప్రజలను రెచ్చగొడుతున్నారని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. అస్సాంను అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ అరెస్ట్ అవడం ఖాయమని జోస్యం చెప్పారు. ముందు అరెస్ట్ చేస్తే అది రాజకీయం అవుతుందని చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయాలు చేయకూడదని భావిస్తున్నామని తెలిపారు.