ఢిల్లీ జల్ బోర్డు టెండర్ అక్రమాలపై విచారణలో రెయిడ్స్
న్యూఢిల్లీ: తమకు మేలు జరిగేలా ఢిల్లీ జల్ బోర్డు టెండర్లలో ఆప్ సర్కారు అక్రమ చెల్లింపులు చేసి రూ.17 కోట్లు లబ్ధి పొందిందన్న ఆరోపణలపై ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది. కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్, ఢిల్లీ జల్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్, పార్టీ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి ఎన్డీ గుప్తా, ఆప్చార్టర్డ్ అకౌంటెంట్ పంకజ్ మంగళ్ తదితరుల ఇండ్లు, ఆఫీసులు సహా 12 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులో సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ జల్బోర్డు టెండర్ ప్రక్రియలో అవకతవకల ద్వారా నిధులు సేకరించి ఆప్ ఎన్నికలకు మళ్లించారనే ఆరోపణలపై ఈడీ రెయిడ్స్నిర్వహించింది. ఢిల్లీ జల్ బోర్డులో జరిగిన అవినీతిపై సీబీఐ కేసు నమోదు చేయగా, నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ కేసులో ఈడీ ఎంటరైంది. టెక్నికల్గా ఏ మాత్రం అర్హత ప్రమాణాలులేని ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆప్సర్కారు రూ.38 కోట్ల కాంట్రాక్టు టెండర్ ఇచ్చిందని, నకిలీ పత్రాలను సమర్పించి సదరు సంస్థ ఈ బిడ్ను దక్కించుకుందని ఈడీ అధికారులు తెలిపారు.
కాంట్రాక్టు విలువ రూ.38 కోట్లలో కేవలం రూ.17 కోట్లు మాత్రమే టెండర్ పనులకు వెచ్చించారని, మిగిలిన మొత్తాన్ని ఎన్నికల నిధులకు మళ్లించేందుకు తప్పుడు ఖర్చులు చూపారని ఈడీ గుర్తించింది. ఈ కేసులో భాగంగా ఈడీ జనవరి 31న జల్ బోర్డు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్కుమార్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ కుమార్ అగర్వాల్లను అరెస్ట్ చేసింది. ఇందులో పెద్ద కుట్రే దాగి ఉందని, దాన్ని బయటకు తీసేందుకు నిందితులను కస్టడీలోకి ఇవ్వాలన్న ఈడీ అభ్యర్థనల మేరకు పీఎంఎల్ఏ స్పెషల్కోర్టు సోమవారం నిందితుల రిమాండ్ను మరో ఐదు రోజులు పొడిగించింది.