
ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించడానికి దక్షిణ మధ్య రైల్వే మరో వినూత్న అడుగు ముందుకు వేసింది. సికింద్రాబాద్ డివిజన్ లోని నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే కోచ్ రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలోనే కాచిగూడ స్టేషన్ ప్రాంగణంలో “రెస్టారెంట్ ఆన్ వీల్స్”ను ప్రారంభించగా..తాజాగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ రెండవ కోచ్ రెస్టారెంట్.
నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ జంట నగరాల సబర్బ్ నెట్వర్క్లోని అత్యంత రద్దీగా ఉండే రైలు స్టేషన్లలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే ట్యాంక్ బండ్, ప్రసాద్ ఐమాక్స్, పీవీ మార్గ్, జలవిహార్, లుంబినీ గార్డెన్, ఎన్టీఆర్ గార్డెన్ వంటి సందర్శన ప్రదేశాలు ఉండటంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడకు వచ్చి జంట నగరాల ఆహార ప్రియులకు అసమానమైన భోజన అనుభూతిని అందించడానికి రైల్వే కోచ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది.
రైల్వే కోచ్ రెస్టారెంట్ కోసం ఉపయోగించని ఒక కోచ్ను ఉపయోగించారు. ప్రయాణీకులకు రైల్లోనే ఉండి తినే ఫీలింగ్ వచ్చేలా ఈ రెస్టారెంట్ ను తీర్చిదిద్దారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్లోని “రైల్ కోచ్ రెస్టారెంట్” ఐదు సంవత్సరాల కాలానికి హైదరాబాద్ కి చెందిన మెసర్స్ బూమరాంగ్ రెస్టారెంట్ వారికి కాంట్రాక్టుకు ఇచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రైల్వే కోచ్ రెస్టారెంట్ లో టిఫిన్ తో పాటు..అన్ని రకాల భోజనం అందుబాటులో ఉండనుంది.