హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విషయంలో నెలకొన్న రాజ్యాంగపరమైన చిక్కులను వెంటనే తొలగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య కేంద్రాన్ని కోరారు. సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంఘం నేతలతో పాటు కలిసి వినతిపత్రం అందించారు.
దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు వారు చెప్పారు. కార్యక్రమంలో తపస్ సంఘటన కార్యదర్శి హనుమంతరావు, ఏబీఆర్ఎస్ఎం ప్రతినిధి సూరం విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి దుబాసి భాస్కర్ ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ టీచర్లకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల14న జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన చేయనున్నట్టు రాజశేఖర్ పేర్కొన్నారు.
