
- గత పార్లమెంట్ సెషన్ లో లేవనెత్తిన ఎంపీ చామల
- తాజాగా ఎంపీ ప్రశ్నకు స్పందిస్తూ నిధులు రిలీజ్ చేసినట్టు రైల్వే శాఖ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ఘట్కేసర్ – -యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని బుధవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డికి లేఖ ద్వారా తెలిపింది. సుమారు 33 కి.మీ. మేర ఉన్న మూడో లైన్ మార్గం కోసం కేటాయించిన రూ.412 కోట్లు విడుదల చేయాలని గత పార్లమెంట్ సమావేశాల్లో జీరో అవర్లో ఎంపీ చామల లేవనెత్తినట్టు అందులో పేర్కొంది. ఆ తర్వాత ఆ నిధుల కేటాయింపుల కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిశారని, పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించారని తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు డిపాజిట్ చేయకపోవడం వలన ప్రాజెక్టును ప్రారంభించలేకపోరు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తిగా రైల్వే శాఖ నిధులతో చేపడుతారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు కేటాయించారు. నిధుల విడుదల ప్రాజెక్టును అమలు చేసే ఏజెన్సీ నుంచి డిమాండ్, ప్రాజెక్టు పురోగతికి అనుగుణంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ కూడా కొనసాగుతోందని రైల్వే శాఖకు చెందిన నవ్ నీత్ సింగ్ లేఖలో ప్రస్తావించారు. అడిగిన వెంటనే రూ.100 కోట్లు కేటాయించడం పట్ల ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.