రాబోయే మూడు రోజులు వర్షాలు

 రాబోయే మూడు రోజులు  వర్షాలు

ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి..తీవ్ర తుపాన్ గా మారింది. రాబోయే మూడు రోజులు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అసని తుపాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్యంగా పయనిస్తూ  తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 810 కిలోమీటర్లు.. పూరికి దక్షిణ ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 12 కల్లా.. అసని తుపాన్ వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

తీవ్ర తుపాన్ ప్రభావంతో బంగాళాఖాతంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. రాయలసీమలోని పలు జిల్లాలో ఈదురుగాలులతోకూడిన వర్షం పడింది. బాపట్ల జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని మచిలీపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 12వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ సముద్ర వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలోనూ రాబోయే మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావం రాష్ట్రంపై ఉందని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసేఛాన్స్ ఉందని చెప్పింది.