తన ఇల్లు అమ్మి నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తానన్న హామీ ఏమైంది?

తన ఇల్లు అమ్మి నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తానన్న హామీ ఏమైంది?
  • కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జంగ్ సైరన్‌లో రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్: బంజారాహిల్స్‌లో తన ఇల్లు అమ్మి నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తానన్న హామీ ఏమైంది..? అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే  సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, మల్లు ఆనంత రాములుమల్లికార్జున్ గౌడ్, జైపాల్ రెడ్డి లాంటి  మహనీయులు గుర్తుకొస్తారని తెలిపారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు, ఇసుక దందాలు చేసేటోళ్లుగా మారి పాలమూరు పరువు తీస్తున్నారని ఆరోపించారు. ‘తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ పార్టీ పెట్టిండు. 2004లో టిఆర్ఎస్ నుంచి అర డజన్ మంత్రులు అయ్యారు. 2008లో ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓటర్లు బండకేసి కొట్టిండ్రు.. 2009లో టిడిపితో పోతుపెట్టుకుంటే 35 సీట్లలో టిఆర్ఎస్‌కు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టిండ్రు.. 2009లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాననే భయంతో మహబూబ్‌నగర్‌లో పోటీ చేస్తే మా ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపిండ్రు.. పోతిరెడ్డిపాడుకు బొక్క పెట్టి కృష్ణ నీళ్లు దోచుకుపోతుంటే కడప జిల్లా ఇంచార్జి మంత్రిగా టిఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు. మంత్రి పదవికి ఆశపడి రాజశేఖర్ రెడ్డి వద్ద కాళ్ళవద్ద పడి పడిగాపులు కాసిండ్రు..’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇక్కడ నుంచి గెలిచాక తెలంగాణ పునర్ నిర్మాణంలో పాలమూరు నుంచే మొదలు పెడ్తానన్నారు, బంజారాహిల్స్ లో తన ఇల్లు అమ్మి ఇక్కడ నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తా అన్నారు, కానీ ఇప్పుడు పాలమూరులో సాగునీటి దోపిడీ జరుగుతుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది.ఇక్కడ పరిశ్రమలు రావడంలేదు.. మా పిల్లలకు ఉద్యోగాలు లెవ్వు.. మా పిల్లలు ఇంకా వలసలు పోవాల్సిందేనా..? బొంబాయిలో కంపెనీలలో పనిచేయాల్సిందేనా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు బడిత పూజ చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ తెలంగాణ రాగానే పూర్తి చేసి ఉంటే ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్లు అవ్వి అక్రమ ప్రాజెక్టులు అనే వారు కాదా అని అన్నారు. 4 వేల కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇవ్వాలన్నా?  లాక్షా 91 వేల ఉద్యోగాలు ఇవ్వాలన్నా అసెంబ్లీ, పార్లమెంట్ అన్ని సీట్లు గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకుంటామంటూ పోలీసులకు హెచ్చరికలు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కు చుక్కలు చూపిస్తామంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.