
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలవడానికి సౌతాఫ్రికా చేరువలో ఉంది. నాలుగో రోజు ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తుంది. సౌతాఫ్రికా విజయానికి మరో 69 పరుగులు కావాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గెలవాలంటే 8 వికెట్లు తీయాలి. దీంతో సఫారీల విజయం లాంఛనమే కానుంది. శనివారం (జూన్ 14) తొలి సెషన్ లో జాగ్రత్తగా ఆడి తొలిసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది.
అక్యూవెదర్ ప్రకారం.. 4వ రోజు ఉదయం కొద్దిసేపు వర్షం పడే అవకాశం ఉంది. మొదటి సెషన్లో 55 శాతం వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. 60 శాతం మేఘావృతం.. గంటకు 48 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. శుక్రవారం (జూన్ 13) సైతం వర్షం పడే అవకాశం చూపించినప్పటికీ రోజు మొత్తం ఆట ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది. ఈ రోజు కూడా ఎలాంటి వర్షం పడే అవకాశాలు లేకపోతే సఫారీల విజయం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ వర్షం పడితే మాత్రం ఆస్ట్రేలియాకు పిచ్ కాస్త అనుకూలంగా మారనుంది.
సాధారణంగా వర్షం పడితే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. పిచ్ మీద ఉన్న తేమను ఉపయోగించుకొని బౌలర్లు స్వింగ్ రాబడతారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వికెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ ఇచ్చిన 282 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో మూడో రోజు, శుక్రవారం చివరకు సౌతాఫ్రికా 213/2 స్కోరుతో నిలిచింది. మార్క్రమ్, బవూమ మూడో వికెట్కు అజేయంగా 143 రన్స్ జోడించి జట్టును గెలుపు ముంగిట నిలిపారు.
తొలి రెండు రోజులు హోరాహోరీగా సాగిన ఆటలో మూడో రోజు సఫారీ టీమ్ పూర్తిగా పైచేయి సాధించింది. ఓపెన్ ఐడెన్ మార్క్రమ్ (159 బాల్స్లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ టెంబా బవూమ (121 బాల్స్లో 5 ఫోర్లతో 65 బ్యాటింగ్) ఫిఫ్టీతో సత్తా చాటడంతో ఆ జట్టు ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు మరో 69 రన్స్ దూరంలో నిలిచింది.