సిటీలో మూడ్రోజులుగా ముసురు పడుతుండడంతో రెయిన్ కోట్స్ అమ్మకాలకు గిరాకీ పెరిగింది. ఢిల్లీ, బెంగళూర్, ముంబయి, కోల్ కతా తదితర ప్రాంతాల నుంచి రెయిన్ కోట్స్ను తీసుకొచ్చి చార్మినార్, కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్, అమీర్పేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఫుట్ పాత్ల మీద అమ్ముతున్నారు. మరోవైపు బేగంబజార్తో పాటు ఇతర చిన్న షాపుల్లో రూ. 300 నుంచి రూ. 3 వేల వరకు, షోరూమ్స్ లో రూ.1,500 నుంచి రూ. 4 వేల వరకు వివిధ డిజైన్, రంగుల్లో రెయిన్ కోట్స్ అందుబాటులో ఉన్నాయి.
వానకు, చలికి రెండు రకాలుగా ఉపయోగపడేలా ఉండే రెయిన్ కోట్స్ ను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని షాప్ల నిర్వాహకులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వానలు ఆలస్యంగా మొదలవడంతో ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోందంటున్నారు. –వెలుగు, హైదరాబాద్

