
- కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత
- ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా
- 9.8 సెంటీ మీటర్లు రికార్డ్
- మరో నాలుగు రోజులూ భారీ వర్షాలే.. ఎల్లో అలర్ట్జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడగా.. ఆ ప్రభావంతో ఆదివారం ములుగు, కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత వాన పడింది. దక్షిణాది జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కామారెడ్డి జిల్లా ఇసాయిపేటలో 8.7 సెంటీ మీటర్లు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 8.4, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 8.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకంపాలెంలో 8, కోయగూడెంలో 7.6, కామారెడ్డిలో 7.3, జగిత్యాల జిల్లా మద్దుట్లలో 6.9, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 6.6, కరీంనగర్ జిల్లా వెంకెపల్లిలో 6.5, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్ సిటీలోనూ శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయందాకా వర్షం దంచికొట్టింది. ఖైరతాబాద్లో అత్యధికంగా 4.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
మరో 4 రోజులు వర్షాలు..
రాష్ట్రంలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ సిటీలోనూ 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది.