
- వెంటనే సమావేశాలు పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ బేఖాతరు
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగుతాయని బుధవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు, పాకిస్థాన్ దాడుల్లో సామాన్య పౌరుల మృతి వంటి పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా 16 అపొజిషన్ పార్టీలు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో నిర్వహించిన భేటీ అనంతరం... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంయుక్తంగా లేఖ రాశాయి.
ప్రతిపక్షాలు ఈ లేఖ రాసిన మరుసటి రోజే.. అంటే బుధవారం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకంది. అయితే ప్రతిపక్ష పార్టీల నేతలంతా జూన్లోనే సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసిన తరుణంలో తాము జులైలో సాధారణ షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. అన్నట్లుగానే కేంద్ర మంత్రి రిజిజు అధికారికంగా తేదీలు ప్రకటించారు.
ఈ సమావేశాల్లో జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిని పసిగట్టడంలో కేంద్ర నిఘా సంస్థల వైఫల్యం, దాడి తర్వాత టెర్రరిస్ట్ ల కదలికలు, ఆపరేషన్ సిందూర్, యుద్ద విమానం కూలడం, ఇతర అంశాలపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు సీజ్ ఫైరింగ్ పై డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటనలు, తాజాగా భారత్ పై సుంకం పెంపును విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు కెనడా వేదికగా జరగనున్న జీ7 సదస్సుకు ఇండియాకు ఆహ్వానం అందకపోవడం వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే చాన్స్ ఉంది. మరో పక్క ఇటీవల నోట్ల కట్టలతో పట్టుబడ్డ జస్టిస్ యశ్వంత్ వర్మపై కూడా అభిసంశన తీర్మానం పెట్టనున్నట్లు విపక్ష నేతలు చెబుతున్నారు.