బెంగాల్‌కు మావోయిజం తిరిగొచ్చింది: గవర్నర్ ధన్‌ఖార్

బెంగాల్‌కు మావోయిజం తిరిగొచ్చింది: గవర్నర్ ధన్‌ఖార్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు మావోయిజం తిరిగొచ్చిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖార్ అన్నారు. సీఎం మమతా బెనర్జీ నాయత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌‌పై ధన్‌ఖార్ తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్‌కతాలోని రాజ్‌ భవన్ నిఘాలో ఉందని, అక్కడి సమాచారం బయటకు పొక్కుతోందని విమర్శించారు. పంద్రాగస్టుకు రాజ్‌ భవన్‌లో హాజరవ్వబోయే గెస్టుల వివరాలు 14వ తేదీనే ఎలక్ట్రానికల్‌గా లీక్‌ అయ్యాయన్నారు.

‘రాజ్‌ భవన్ సర్వైలెన్స్‌లో ఉంది. ఇది జరగకూడదు. రాజ్యాంగం పరిధిలోకి వచ్చే ఆఫీసుపై నిఘా ఎలా వేస్తారు? మా విచారణ ముగిసిన వెంటనే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ప్రజా సేవకులు రాజకీయ వ్యవహారాల్లో తల దూర్చకూడదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు’ అని గవర్నర్ ధన్‌ఖార్ దుయ్యబట్టారు. మాజీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాజ్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ధన్‌ఖార్ పైవ్యాఖ్యలు చేశారు. సీఎం మమతా బెనర్జీని కూడా ధన్‌ఖార్‌‌ విమర్శించారు. ‘రాష్ట్రంలో న్యాయ రాహిత్యం ఉంది. హూగ్లీ జిల్లాలో పంద్రాగస్టున ఒకర్ని చంపేశారు. నేతల మద్దతుతో మావోయిజం తన ప్రాభవాన్ని చూపిస్తోంది’ అని మండిపడ్డారు.