- ఆయన సినిమాలు బహిష్కరించాలని పిలుపు
బషీర్బాగ్, వెలుగు: ప్రముఖ సినీ దర్మకుడు ఎస్ఎస్ రాజమౌళిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. ఆయన సినిమాలను హిందువులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హిందు దేవుళ్లపై సినిమాలు తీస్తూ , కోట్లు గడిస్తున్న రాజమౌళి.. మన దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇటీవల గ్లోబ్ ట్రాటార్ ఈవెంట్లో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు రాజమౌళిని విమర్శిస్తూ వీడియోలు విడుదల చేయడమే కాకుండా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో రాజమౌళి ఇష్టారీతిన పోస్టులు చేశారన్నారు. ధర్మంపై ఎవరు తప్పుగా మాట్లాడిన హిందు సమాజం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. హిందు సమాజానికి రాజమౌళి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
