
- మునుగోడులో పోటాపోటీ సభలు
- ఇయ్యాల కేసీఆర్.. రేపు అమిత్ షా రాక
- భారీ బహిరంగ సభలకు టీఆర్ఎస్, బీజేపీ ఏర్పాట్లు
- ఉప ఎన్నిక షెడ్యూల్కు ముందే పొలిటికల్ హీట్
- 2 వేల కార్ల కాన్వాయ్తో మునుగోడుకు కేసీఆర్
- అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి రాజగోపాల్
- భారీ జన సమీకరణపై రెండు పార్టీల కసరత్తు
హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: మునుగోడులో పొలిటికల్ హీట్ పెరిగింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తుండటంతో షెడ్యూల్కు ముందే ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ గెలిచి సత్తా చాటాలని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. మునుగోడులో శనివారం సీఎం కేసీఆర్ సభ, ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ జరగనున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇతర పార్టీల్లోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి ఎంపీ సీట్లను కోల్పోయిన గులాబీ పార్టీ.. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని ఎత్తులు వేస్తోంది. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ బలమేంటో ఇతర పార్టీలకు చాటి చెప్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం కేసీఆర్ 2 వేల కార్ల కాన్వాయ్తో బహిరంగ సభకు ప్రగతి భవన్ నుంచి తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి వెయ్యి కార్లు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచి ఇంకో వెయ్యి కార్లను ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలంతా తమ స్టిక్కర్లతో ఈ వాహనాలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ‘మునుగోడు ప్రజాదీవెన సభ’లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు, పోచంపల్లి క్రాస్ రోడ్డు, చౌటుప్పల్, నారాయణపూర్, చల్మెడ మీదుగా కేసీఆర్ కాన్వాయ్ మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడుకు చేరుకోనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఒకేసారి 2 వేల కార్లతో కేసీఆర్ బయల్దేరుతారు. ప్రగతి భవన్ నుంచి మునుగోడు వరకు భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు, టీఆర్ఎస్ జెండాలు ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 20 వేల మంది చొప్పున 1.20 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు.
అభ్యర్థిని ప్రకటిస్తారా?
అమిత్ షా ప్రచార సభకు ముందే తమ సత్తా ఏంటో చాటేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతున్నదో చెప్పడంతోపాటు బీజేపీ టార్గెట్గా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సహా పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ సభలో ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారనేది పార్టీ నేతల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థిని ప్రకటించారు. ఇక్కడా అదే ఫార్ములా పాటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ముందే అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీలోని అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవడానికి సమయం ఉంటుందని, ఆలస్యంగా ప్రకటిస్తే అసంతృప్తులను బుజ్జగించడానికి టైం ఉండదని, అది చేటు తెస్తుందనేది కేసీఆర్ భావనగా తెలుస్తోంది. టికెట్ దక్కని నేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.
అంతకుమించి ఉండేలా..
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో జోష్ మీదున్న బీజేపీ.. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బైపోల్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇదే వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీలో చేరనుండడంతో ఈ సభ సక్సెస్ చేసేందుకు కమలదళం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కేసీఆర్ సభకు మించి అమిత్ షా సభ విజయవంతం చేసి.. బీజేపీకి ప్రజల్లో ఉన్న మద్దతును రాష్ట్రవ్యాప్తంగా చాటి చెప్పాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జన సమీకరణపై దృష్టి పెట్టారు. మునుగోడు శివారులో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వర్షం వచ్చినా సభకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు జర్మనీ టెక్నాలజీ టెంట్లు వేస్తున్నారు. ప్రధాన సభా వేదిక, వాటి పక్కన మరో రెండు వేదికలు, సాంస్కృతిక బృందాల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కనీసం లక్ష మందికి సరిపోయేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. సభ సక్సెస్ కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించింది. మండలాల వారీగా ఇన్చార్జ్లను కూడా నియమించింది. వివేక్ వెంకటస్వామి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో కలిసి సభాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గంలో, హైదరాబాద్ నుంచి మునుగోడు మార్గంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు, కమలం తోరణాలు కట్టి మొత్తం కాషాయ మయం చేసే ఏర్పాట్లలో బీజేపీ నిమగ్నమైంది.
అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదీ
అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రక్షణ శాఖకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 4.25 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అక్కడ 4.35 నుంచి 4.50 వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో రివ్యూ చేస్తారు. సాయంత్రం 4.50 నుంచి 6 గంటల వరకు మునుగోడు సభలో పాల్గొంటారు. తర్వాత హెలికాప్టర్లో తిరిగి 6. 45కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 6.45 నుంచి 7.30 గంటల వరకు రామోజీ ఫిలిం సిటీలో గడుపనున్నారు. రాత్రి 8 గంటలకు శంషాబాద్లో నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి బీజేపీ ముఖ్య నేతలను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలు, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. అక్కడే డిన్నర్ ముగించుకుని రాత్రి 9. 40కు ఢిల్లీ బయలుదేరుతారు. మొత్తంగా అమిత్ షా ఆరు గంటల పాటు రాష్ట్రంలో గడపనున్నారు.
సంజయ్ యాత్రకు విరామం
అమిత్ షా రాక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రకు ఆదివారం విరామం ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమిత్ షాను రిసీవ్ చేసుకొని, తిరిగి సెండాఫ్ ఇచ్చే వరకు కేంద్ర హోం మంత్రి వెంటే సంజయ్ ఉండనున్నారు. మునుగోడు సభలో పాల్గొనడంతోపాటు అమిత్ షా పాల్గొననున్న పార్టీ ముఖ్య నేతల భేటీకి సంజయ్ హాజరవుతారు. మరోవైపు నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి జితేందర్ రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుట్టా రాకేష్ ముదిరాజ్.. కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. వీరంతా ఆదివారం అమిత్షా సమక్షంలో కాషాయకండువా కప్పుకోనున్నారు.