మునుగోడులో గెలిస్తే రాష్ట్ర భవిష్యత్తు మారుండేది : రాజగోపాల్

మునుగోడులో గెలిస్తే రాష్ట్ర భవిష్యత్తు మారుండేది : రాజగోపాల్

సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎల్గబెట్టనోడు దేశాన్ని ఉద్దరిస్తాడా అంటూ సెటైర్లు వేశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెరలేపిండన్నారు. లిక్కర్ స్కాంలో  జైలుకు పోతమనే భయంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిండని విమర్శించారు. కేసీఆర్ ది  ఓ డ్రామా అని అన్నారు.  మునుగోడులో పార్టీ ఆఫీస్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ  వర్చువల్ మీటింగ్ లో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. దేశ చరిత్రలో మునుగోడు ప్రజలు చరిత్రకారులయ్యేవారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

మూడు నెలలు కేసీఆర్ తన కౌరవ సైన్యాన్ని నిద్రపోనియ్యకుండా మునుగోడులో తిప్పిండని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఐదు వేల మంది ఇంటలిజెన్స్ పోలీసులతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్ మొత్తం తమను మునుగోడులో ఓడగొట్టడానికి పనిచేశారన్నారు. మునుగోడులో గెలిస్తే  తెలంగాణ రాష్ట్ర భవిష్యత్త్ మారేదన్నారు. తెలంగాణలో రాచరిక పాలన అంతం కావాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ ఏ బాధ్యత అప్పచెప్పినా కట్టుబడి పనిచేస్తానని.. పదవుల కోసం కాకుండా  మునుగోడు ప్రజల కోసం పనిచేస్తానని  రాజగోపాల్  అన్నారు.