
సుజీత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన సాహో మూవీ ఆగష్టు- 30న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ మూవీ యూనిట్. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ నేషనల్ వైడ్ గా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. సాహో సినిమా విషయాలను చెప్పిన ప్రభాస్..బాహుబలి -3 గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పి ఫ్యాన్స్ ను థ్రిల్ చేశాడు.
జక్కన్న రాజమౌళికి ఇంట్రెస్ట్ ఉంటే బాహుబలి- 3 కూడా తెరకెక్కే అవకాశం ఉందన్నాడు. తాము బాహుబలి రెండు భాగాల్లో 60% స్టోరీని మాత్రమే పూర్తి చేశామని చెప్పాడు. రాజమౌళి మనసులో బాహుబలి సీక్వెల్-3 కూడా ఉందన్నాడు. అయితే అది కార్యరూపం దాల్చే అవకాశాల గురించి మాత్రం తనకు తెలియదన్నాడు. బాహుబలితో తన అనుబంధాన్ని పంచుకుంటూ.. నాలుగు సంవత్సరాలు ఆ సినిమా కోసం కేటాయించినందుకు తనకు ఏ మాత్రం బాధలేదన్నాడు. జీవితంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నాడు. కొన్నిసార్లు ఈ సినిమా స్టోరీలో లీనమయ్యి.. తనను తానే మర్చిపోయే సంఘటనలు కూడా జరిగాయని చెప్పుకొచ్చాడు ప్రభాస్.