సిద్దిపేట రూరల్, వెలుగు: సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, మహిళలు, విద్యార్థినులకు షీ టీమ్స్ పనితీరుపై మరింత అవగాహన కల్పించాలని రాజన్న జోన్ డీఐజీ సున్ప్రీత్ సింగ్ ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట సీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయనకు సీపీ రష్మి పెరుమాళ్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా శాంతిభద్రతలు, వినూత్న కార్యక్రమాలపై సీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచేలా విజిబుల్ పోలీసింగ్ కొనసాగించాలని, క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. కేసుల దర్యాప్తును వేగం చేయడంతో పాటు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నివారణకు ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచి యువతలో అవగాహన కల్పించాలని చెప్పారు.
