
జైపూర్: ఈత సరదా 8 మంది ప్రాణాలను బలిగొంది. విహారయాత్ర కోసం వచ్చిన వారు నదిలో మునిగి చనిపోయారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో మంగళవారం జరిగింది. జైపూర్ కు చెందిన 11 మంది యువకులు విహారయాత్ర కోసం టోంక్ కు వచ్చారు. స్నానం చేసేందుకు బాన్సస్ నదిలో దిగారు. అందరూ కాసేపు సరదాగా నదిలో స్నానం చేశారు. ఈ క్రమంలో లోతైన ప్రదేశంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయారు.
సమీపంలో ఉన్న స్థానికులు గమనించి వెంటనే నదిలోకి దిగి ముగ్గురు యువకులను రక్షించారు. మిగతా 8 మందిని కాపాడే ప్రయత్నం చేసినా వీలులేక పోయింది. నదిలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీయించారు.