రాజధాని ఫైల్స్ మూవీ ఫిబ్రవరి 15న రిలీజ్

రాజధాని ఫైల్స్ మూవీ ఫిబ్రవరి 15న రిలీజ్

ఏపీ రాజధాని కథాంశంగా భాను దర్శకత్వంలో కంఠంనేని  రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. అఖిలన్, వీణ, అంకిత ఠాకూర్, అమృత చౌదరి ఇతర పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ  రిలీజ్ ప్రెస్‌‌ మీట్ నిర్వహించారు.

వినోద్ కుమార్ మాట్లాడుతూ ‘ఇది పొలిటికల్ సినిమా కాదు.. రైతుల ఆవేదన తెలియజేసే కథ.  ఇందులో రైతు పాత్రని పోషించా. ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉందన్నారు వాణీ విశ్వనాథ్. ‘ఏపీ రాజధాని కోసం భూముల్ని త్యాగం చేసిన వేలాదిమంది రైతుల ఆవేదనను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం’ అని దర్శకుడు భాను అన్నాడు.

ఈ సినిమా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. రైతుల కన్నీళ్లు తుడిచే విధంగా సమాజాన్ని చైతన్యపరుస్తూ సామాజిక బాధ్యతగా ఈ సినిమా చేశామన్నారు నిర్మాత రవిశంకర్. మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.