హైదరాబాద్లో మరోసారి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీశారు. భయంతో కొందరు పరుగులు తీశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, బషీర్ బాగ్ , బేగంబజార్, కోఠి, మీర్ పేట్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, ఛత్రినాక, శాలిబండ ప్రాంతాల్లో గాలితో కూడుకున్న వర్షం కురిసింది.
ఉదయం ఎండలు, సాయంత్రం వర్షాలతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమవుతున్నాయి. ఎండలు ఎక్కువవడంతో జనం కూడా బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. సాయంత్రం కాగానే బయటకు వెళ్దామనుకునే సరికి వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్రామాల్లో వరి చేన్లు, మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.