హైదరాబాద్ బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఈ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నోటిఫికేషన్ ఇవ్వగా.. మంగళవారం (మే 2) లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. బండ్లగూడ (నాగోల్), పోచారం(ఘట్కేసర్)లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఏప్రిల్ 15వ తేదీ నాటికి టోకెన్ అడ్వాన్స్ కట్టిన వారి పేర్లతో పారదర్శకంగా లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నారు.ముందు నిర్ణయించిన ధర ప్రకారమే లాటరీలో ఫ్లాట్లను కేటాయిస్తారు. పోచారం,బండ్లగూడలలో మిగిలిపోయిన ఫ్లాట్ల కేటాయింపులు లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక జరుగుతుంది. టోకెన్ అడ్వాన్స్ కట్టిన దరఖాస్తుదారులు లాటరీ తీసేటప్పుడు ప్రత్యక్షంగా హాజరుకావాలని కోరారు.
ముందు నిర్ణయించిన విధంగానే లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. లాటరీ ప్రక్రియ ఫేస్బుక్, యూట్యూబ్లలో లైవ్ స్ట్రీమింగ్కు ఏర్పాట్లు చేశారు. పారదర్శకతను నిర్ధారించడానికి పూర్తి ప్రక్రియను హెచ్ఎండీఏ అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ఆధార్ సంఖ్యను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు. లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.