- సిటీలో రాఖీ కొనుగోళ్లతో సందడి
- స్వీట్ షాపుల్లో రద్దీ
పద్మారావునగర్, వెలుగు : గ్రేటర్ సిటీలో రాఖీ పండుగ సందడి మొదలైంది. తో అన్నాచెళ్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలకు ప్రతీకైన పండుగ వైభవం సంతరించుకుంది. బుధవారం పుట్టిన ఊళ్లకు వెళ్లే మహిళలతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. తమ సోదరులకు కట్టేందుకు ఫ్యాన్సీ, వెండి, బంగారు రాఖీలను కొనగోలు చేసి తీసుకెళ్లారు. రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో పాటు మహిళల సంఖ్య ఎక్కువగా కనిపించింది.
పండుగ సందర్భంగా స్వీట్షాపుల్లోనూ రద్దీ నెలకొంది. సర్దార్ పటేల్ కాలేజీ విద్యార్థినులు బుధవారం మారేడ్పల్లి ఏవోసీ ఆర్మీ సెంటర్-–1లో రక్షాబంధన్వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వందమంది సైనికులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మీ అధికారులు, లెక్చరర్స్ టి.అమర్ సింగ్, సునీత, నాగలక్ష్మి ఉన్నారు.
ఆర్టీసీలో రాఖీ రష్..
హైదరాబాద్ : ఆర్టీసీకి రాఖీ పండుగ జోష్ వచ్చింది. రాఖీ పండుగ నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రధాన బస్టాండ్లలో బుధవారం ఉదయం నుంచే రద్దీ నెలకొంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ , జేబీఎస్, ఉప్పల్, ఎల్ బీ నగర్, ఆరాంఘర్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్యాసింజర్లు కిటకిటలాడారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, అన్ని సర్వీసులు రద్దీగా తిరుగుతున్నాయి.
3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించినా సరిపోవడం లేదని ప్యాసెంజర్లు ఆరోపిస్తున్నారు. సిటీ లో ని పలు ప్రాంతాల్లో బస్సుల ఆపరేషన్ కు 11 మంది ఆఫీసర్లను ఆర్టీసీ ప్రత్యేకంగా నియమించింది.