హైదరాబాద్: ఇండియా తరఫున తొలి ఒలింపిక్ మెడల్ గెలిచిన మహిళా క్రీడాకారిణిగా తెలుగు తేజం కరణం మల్లీశ్వరి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె బయోపిక్ను టాలీవుడ్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో నటించే తారాగణం గురించి మాత్రం ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఈ ప్రాజెక్టులో లీడ్ రోల్ మల్లీశ్వరి పాత్రకు హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్లో రాణిస్తున్న తాప్సీ పన్ను పేర్లు వినిపించాయి. అయితే ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. మల్లీశ్వరి 45వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న మల్టీలింగ్యువల్గా మూవీని తెరకెక్కిస్తున్నట్లు కోన వెంకట్ ప్రకటించారు.
రామ్ గోపాల్ వర్మతో కలసి పని చేసిన సుజనా రెడ్డి అనే డైరెక్టర్కు సినిమా బాధ్యతలు అప్పజెప్పారు. రకుల్ ఈ సినిమాలో నటిస్తోందని సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై కోన వెంకట్ క్లారిటీ ఇచ్చారు. ‘అది నిజం కాదు. మేం ఇంకా స్క్రిప్ట్ పైనే పని చేస్తున్నాం. అది పూర్తయ్యాక పాత్రకు సరిపోయే యాక్టర్ను కలుస్తాం. రకుల్ పాన్ ఇండియా స్టార్, అలాగే మంచి నటి కూడా. ఇది బహు భాషా చిత్రమైనందున ఆమె తప్పకుండా మా మైండ్లో ఉంటుంది. కానీ మేం ఇప్పటికీ ఎవ్వర్నీ ఫైనలైజ్ చేయలేదు’ అని కోన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆఖరులో సినిమా సెట్స్పైకి వెళ్లే చాన్సెస్ ఉన్నాయి.