ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. నవదీప్ కీలక పాత్ర పోషించాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. మంగళవారం ఈ మూవీ తెలుగు ట్రైలర్ను రామ్ చరణ్, హిందీ ట్రైలర్ను సల్మాన్ ఖాన్ విడుదల చేసి వరుణ్కి బెస్ట్ విషెస్ చెప్పారు.
యాక్షన్, ఎమోషన్తో పాటు దేశభక్తితో కూడిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘తెలుగులో ఇది మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసే చాలా సీన్స్ ఇందులో ఉన్నాయి.
గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్కి సెల్యూట్ కొడతారు. జవాన్స్ త్యాగాలను, ధైర్య సాహసాలని చూపించే ప్రయత్నమే ఈ సినిమా’ అని చెప్పాడు. ఇది చాలా స్పెషల్ మూవీ అని, తనకు డ్రీమ్ రోల్ అని చెప్పింది మానుషి చిల్లర్. కీలక పాత్రలో కనిపిస్తానన్నాడు నవదీప్. యాక్షన్, డ్రామా, ఫన్, ఎమోషన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చెప్పారు.