
గోదావరిఖని, వెలుగు: పేదల సంక్షేమం, నగర అభివృద్ధే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో సిటీలో వివిధ అభివృద్ధి పనులపై బల్దియా అధికారులతో కమిషనర్ జె.అరుణ శ్రీతో కలిసి రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక సిటీలో రూ.వందల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. శానిటేషన్ కార్మికుల సేవలతో టౌన్ పరిశుభ్రతతోపాటు ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉందన్నారు.
ప్రతి పని నాణ్యతతో, సకాలంలో పూర్తయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని రామగుండం తహసీల్దార్ను ఆదేశించారు. అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న ఎస్టీపీ నిర్మాణ పనులను స్పీడప్ చేయాలన్నారు. మీటింగ్లో ఏసీపీలు ఎం.రమేశ్, సీహెచ్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ శివానంద్, ఈఈ రామన్, తహసీల్దార్ దత్తుప్రసాద్, వివిధ ఆఫీసర్లు పాల్గొన్నారు.