రామలింగేశ్వర స్వామి జాతర షురూ

రామలింగేశ్వర స్వామి జాతర షురూ

కామేపల్లి, వెలుగు :  మండలంలోని కొండాయిగూడెం, కొమ్మినేపల్లి, పండితాపురం గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.  ఈ జాతర నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. తొలిరోజు రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో తోరణ అలంకరణ చేసి  స్వామివారిని పెళ్లికొడుకును చేశారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపారాధన, ధ్వజా రోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు.  

అనంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. అంతకుముందు స్వామివారిని ఆలయంలోకి వేదమంత్ర పండితుల ఆశీర్వాదాల నడుమ  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్,  కాంగ్రెస్ జిల్లా నాయకుడు, సీనియర్ అడ్వోకేట్​ బోడేపూడి విఠల్ రావు స్వామి వారిని తీసుకొచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నల్లమోతు లక్ష్మయ్య, మండల నాయకులు మద్దినేని రమేశ్​బాబు, దేవండ్ల రామకృష్ణ, జన్నార్పు లింగయ్య, శబరి, బత్తుల ఉపేందర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.