- వేర్హౌజింగ్ బిజినెస్లోకి వస్తున్నం
- ప్రకటించిన రామ్కీ గ్రూప్
హైదరాబాద్, వెలుగు: చెన్నై, బెంగళూరు హైదరాబాద్లలో 15 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.10 వేల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నట్లు రామ్కీ గ్రూప్కు చెందిన రామ్కీ ఎస్టేట్స్ తెలిపింది. వచ్చే 3–-5 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ మూడు నగరాల్లో తమకు 1,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని అని రామ్కీ ఎస్టేట్స్ డైరెక్టర్ తారకేష్ రాజేష్ దాసరి తెలిపారు. హైదరాబాద్ బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కంపెనీ ఇప్పటివరకు రూ. 3,500 కోట్ల విలువైన 10 మిలియన్ చదరపు అడుగుల్లో హౌజింగ్ ప్రాపర్టీలను పూర్తి చేసిందని చెప్పారు. 2023–-24లో రూ. 2,000 కోట్ల కంటే ఎక్కువ మొత్తం బుకింగ్స్ వస్తాయని భావిస్తున్నామని, రెసిడెన్షియల్ యూనిట్ల ధరలు రూ. 45 లక్షల నుండి రూ. 5 కోట్ల వరకు ఉంటాయని అని రామ్కీ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ తెలిపారు. కమర్షియల్ రియల్టీకి పెట్టుబడులు ఎక్కువగా కావాలని, ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టే ఆ సెగ్మెంట్లో తమకు ఎక్కువ ప్రాజెక్టులు లేవని చెప్పారు.
90:10 నిష్పత్తికి కట్టుబడి ఉంటామని, తమ దగ్గర 90 శాతం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉంటే, మిగిలిన పదిశాతం కమర్షియల్ ప్రాజెక్టులు ఉంటాయని వివరించారు. అయితే, ఈ–-కామర్స్ సంస్థల నుంచి పెరుగుతున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, వేర్హౌసింగ్ రంగంలోకి ప్రవేశించాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 3–-4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వేర్హౌసింగ్ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని కిషోర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇండ్ల కొనుగోలుదారుల కోసం మెటావర్స్ విండో ‘రామ్కీ వెర్స్’ను ప్రారంభించింది. వినియోగదారులు వర్చువల్ రియాల్టీ ద్వారా తమ ఇంట్లో నుంచే ప్రాపర్టీలను చూడవచ్చు. ఈ సదుపాయం జూలై 14 నుండి అందుబాటులోకి వస్తుంది.