
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుబాటి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసుకు రానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు జులై 21న ఈడీ సమన్లు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం జులై 23న విచారణకు రానా హాజరు కావాల్సిన ఉండగా, షూటింగ్స్ కారణంగా రాలేకపోయాడు.
దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ కేసులో జులై 30న ప్రకాశ్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు, ఈ నెల13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే.
లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. ఈ క్రమంలో విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. మంచు లక్ష్మి విచారణ అనంతరం మరికొంత మంది సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు
ఏర్పాట్లు చేస్తున్నారు.