
ముంబై : టాటా మోటార్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) భారతదేశంలోనే తన రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించనుంది. యూకే వెలుపల రేంజ్ రోవర్ కార్లు తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు యూకేలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ సోలిహుల్ ప్లాంట్లో మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 121 మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ఈ బ్రిటిష్ బ్రాండ్ భారతదేశంలోని పెద్ద సంఖ్యలో కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఇక్కడికి రావాలని నిర్ణయించుకుంది.
స్థానిక ఉత్పత్తితో రెండు మోడళ్ల ధర 18–-22 శాతం వరకు తగ్గనుంది. టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా 15 ఏళ్ల క్రితం టాటా కుటుంబానికి జేఎల్ఆర్ బ్రాండ్ను తీసుకొచ్చారని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రశంసించారు. రేంజ్ రోవర్ను భారతదేశంలోనే తయారు చేస్తారనేది ఒక సూపర్ ఫీలింగ్ అని కామెంట్ చేశారు. మున్ముందు దేశంలో విక్రయాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
మొదట రెండు మోడల్స్
జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా మాట్లాడుతూ, దేశంలోని వినియోగదారుల కోసం రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. జేఎల్ఆర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రిటైల్ అమ్మకాలు 81 శాతం పెరిగి 4,436 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కంపెనీ కూడా రాబోయే నాలుగేళ్లలో భారతదేశంలో ఆరు కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని అంబా పేర్కొన్నారు.
స్థానిక ఉత్పత్తి వల్ల ఈ ఏడాది ఆగస్టులో డెలివరీలకు అందుబాటులో ఉండే రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర ప్రస్తుతం రూ.1.9 కోట్లతో పోలిస్తే రూ.1.4 కోట్లకు తగ్గుతుందని అంబా చెప్పారు. కంపెనీ ఇప్పటికే రేంజ్ రోవర్ వెలార్, రేంజ్ రోవర్ ఎవోక్, జాగ్వార్ ఎఫ్-పేస్, డిస్కవరీ స్పోర్ట్లను పూణేలో అసెంబుల్ చేస్తోంది.