- ఎస్సీలకు అన్యాయం చేసిన మందకృష్ణ మాదిగ
- రాజ్యాంగ పరిరక్షణ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రేంజర్ల రాజేశ్
కాగ జ్ నగర్, వెలుగు: హిందూ దేవుళ్లను విమర్శించడం, వారికి వ్యతిరేకంగా మాట్లాడడం తన ఉద్దేశం కాదని.. దేవుళ్ల పేరుతో లబ్ధి పొందేవారు, వ్యాపారం చేసేవారిపైనే తాను వ్యాఖ్యలు చేశానని రాజ్యాంగ పరిరక్షణ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రేంజర్ల రాజేశ్ అన్నారు. మహర్కులం నుంచి సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారిని ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సన్మానించారు.
కార్యక్రమానికి హాజరైన రాకేశ్ మాట్లాడుతూ.. మహర్ జాతిలో పుట్టిన అంబేద్కర్ దేశానికి మార్గదర్శనం చేశారని, రాజ్యాంగం రూపొందించారని పేర్కొన్నారు. అంబేద్కర్ మార్గంలో నడిచినప్పుడే మహర్లకు గౌరవమని, అందుకు సమష్టిగా ముందుకెళ్లాలని సూచించారు.
ఎస్సీల పేరుతో ఉద్యమం చేసిన మందకృష్ణ.. బీజేపీ చెంత చేరి ఏబీసీడీ వర్గీకరణకు ఒప్పుకొని 58 ఉప కులాలకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. సమావేశంలో రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జాడి అన్నారావు, సీనియర్ జర్నలిస్ట్ మసాదే లక్ష్మీనారాయణ, సమతా సొసైటీ అధ్యక్షుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జనార్ధన్ పాల్గొన్నారు.
