జమ్మూ: జమ్మూ కశ్మీర్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–డి మ్యాచ్లో హైదరాబాద్ భారీ ఓటమి దిశగా సాగుతోంది. జమ్మూ కశ్మీర్ నిర్దేశించిన 472 రన్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం మూడో రోజు బరిలోకి దిగిన హైదరాబాద్ ఆట ముగిసే టైమ్కు రెండో ఇన్నింగ్స్లో 52.3 ఓవర్లలో 169/7 స్కోరు చేసింది.
అనికేత్ రెడ్డి (35 బ్యాటింగ్), రక్షణ్ రెడ్డి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఛేదనలో జమ్మూ బౌలర్లు అబిద్ ముస్తాక్ (4/56), సాహిల్ లోట్రా (2/28) దెబ్బకు హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (47), రాహుల్ సింగ్ (30), రాహుల్ రాదేశ్ (20) మోస్తరుగా ఆడినా.. అభిరత్ రెడ్డి (18), హిమతేజ (12), నితీశ్ రెడ్డి (0), తనయ్ త్యాగరాజన్ (0) నిరాశపర్చారు.
అంతకుముందు 275/4 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్లో 100.5 ఓవర్లలో 422 రన్స్కు ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (125), కన్హయ్య వాధవన్ (95) ఐదో వికెట్కు 191 రన్స్ జత చేశారు. సాహిల్ లోట్రా (7), ఉమర్ నజిర్ మిర్ (9) ఫెయిలైనా, అబిద్ ముస్తాక్ (22), అఖీబ్ నబీ (27) ఫర్వాలేదనిపించారు. తనయ్ 4, రక్షణ్ 3, కార్తికేయ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఒక్క రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలవాలంటే ఇంకా 303 రన్స్ చేయాలి. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.
