
లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే విగ్రహాన్ని వింబుల్డన్లో ఆవిష్కరించనున్నారు. 2027లో వింబుల్డన్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే తన విగ్రహాన్ని రూపొందించడానికి ముర్రే సాయం చేయనున్నారు. ‘2027 ఎడిషన్లో బ్రిటిష్ టెన్నిస్ గ్రేట్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. విగ్రహం రూపకల్పనలో ముర్రే కూడా భాగం పంచుకోవడం సముచితంగా భావిస్తున్నాం’ అని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చైర్మన్ డెబ్బీ జెవాన్స్ తెలిపారు.
2013 ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ను ఓడించిన ముర్రే.. 77 ఏళ్ల తర్వాత బ్రిటన్కు వింబుల్డన్ టైటిల్ అందించాడు. 2016 టైటిల్ ఫైట్లో మిలోస్ రావోనిక్ను ఓడించి రెండోసారి విజేతగా నిలిచాడు. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్లో 14సార్లు టైటిల్స్ సాధించిన రఫెల్ నడాల్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఆ కార్యక్రమానికి ముర్రే కూడా హాజరయ్యాడు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముర్రే విగ్రహాన్ని నెలకొల్పనున్నారు.