- భగ్గుమంటున్న రేట్లు.. అన్నీ కిలో రూ. 60కి పైనే
- సర్కారు సాయం లేక.. ధర రాక వేరే పంటలకు మళ్లుతున్న రైతులు
- రాష్ట్రంలో ఇప్పటికే 11.04 లక్షల టన్నుల వెజిటబుల్స్ కొరత
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది రాష్ట్రంలో వెజిటబుల్స్ సాగు టార్గెట్ 4.98 లక్షల ఎకరాలు. ఈ వానాకాలంలో 2.50 లక్షల ఎకరాల్లో సాగు జరగాలి. కానీ ఇప్పటివరకు 90 వేల ఎకరాల్లోనే కూరగాయల పంటలేశారు. హైదరాబాద్ శివారు జిల్లాల్లో కూరగాయల సాగు ఎక్కువుండేది.రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో రైతులు వెజిటబుల్స్ను ఎక్కువగా వేసేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో గతంతో పోలిస్తే కూరగాయల సాగు భారీగా తగ్గింది.
రాష్ట్రంలో ఏటా 11 లక్షల టన్నుల కొరత
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టడీ ప్రకారం రోజూ ఒక్కొక్కరు 325 గ్రాముల కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభాకు అనుగుణంగా ఏడాదికి 41.75 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 30.71 లక్షల టన్నుల వెజిటెబుల్స్ మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఏటా 11.04 లక్షల టన్నుల కూరగాయల కొరత ఉంటోంది. ఇప్పుడు సరఫరా ఇంకా తగ్గడంతో కొరత భారీగా పెరిగింది.
సాగు లేక ధరలకు రెక్కలు
సాగు బాగా పడిపోవడంతో మార్కెట్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్లో వెజిటబుల్స్ ఏవీ కూడా కిలో రూ. 60కి తక్కువ లేవు. బీరకాయలు, పచ్చిమిర్చి కిలో రూ.100 పలుకుతున్నాయి. దోసకాయను కూడా రూ.80 దాకా అమ్ముతున్నరు.
గిట్టుబాటున్న పంటలే వేస్తున్నరు
ధర ఎంత వస్తదో తెలియని వెజిటబుల్ క్రాప్స్ వేయడానికి రైతులు ధైర్యం చేయట్లేదు. వరి, పత్తి, కంది, ఇతర పంటలేస్తే మద్దతు ధర వస్తుందని అంటున్నారు. టెక్నాలజీ వినియోగం, మార్కెటింగ్ మెలకువలపై రైతులకు అవగాహన కల్పించడం, మార్కెట్ లింకేజీ కల్పిస్తే ఎక్కువ పంట పండించే అవకాశం ఉంటుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు.