తన ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకునే టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. భార్య కోసం బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను పొగడ్తలతో ముంచెత్తి వివాదంలో ఇరుకున్నాడు. గుజరాత్ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ తరపున జామ్ నగర్ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న జడేజా..ఆర్ఎస్ఎస్ పై భార్య రివాబా అభిప్రాయానికి మద్దతు పలికాడు. ఆర్ఎస్ఎస్ ను ఆకాశానికెత్తాడు.
అసలు సంగతేంటంటే..?
గుజరాత్లో జరిగిన ఓ కార్యక్రమంలో రివాబా జడేజా ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించింది. దీనిపై స్పందించిన జడేజా ఆర్ఎస్ఎస్ గురించి నీకున్న పరిజ్ఞానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. భారత సంప్రదాయాలు, సమాజంలోని విలువలను నిలబెట్టి ఆదర్శాలను ప్రోత్సహించే సంస్థ ఆర్ఎస్ఎస్ అని కొనియాడాడు. కృషి, నైపుణ్యాలతో ఇలాగే ముందుకు వెళ్లు.. అంటూ తన భార్యని ఉద్దేశిస్తూ పొగిడాడు.
జడేజాపై విమర్శలు..
జడేజా వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. జడేజా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్..సీబీఐ, ఈడీల భయంతో నటులు, క్రీడాకారులు బీజేపీని పొగిడేందుకు పోటీ పడుతున్నారని కాంగ్రెస్ మండిపడింది. ప్రొఫెషనల్ క్రికెటర్గా ఉన్న జడేజా ఒక రాజకీయ పార్టీ గురించి బహిరంగ వేదికల్లో మాట్లాడటం సమంజసమేనా? అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. దేశాన్ని బీజేపీ స్వాధీనం చేసుకుందని ఆరోపించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా నియమితులైన తర్వాత క్రికెట్ బీజేపీ పరమైందని పేర్కొంది. అమిత్ షా కొడుకు కావడం మినహా బీసీసీఐ సెక్రటరీగా ఉండటానికి జైషాకు ఉన్న అర్హతలేంటి? అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. జడేజా రాజకీయాల్లో చేరారా..? లేక బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు బీసీసీఐ సరెండర్ అయిందా అని మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.