న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సెక్టార్కు బ్యాంకులిచ్చిన అప్పులు (బకాయిలు) ఏకంగా రూ.28 లక్షల కోట్లకు పెరిగాయి. ఆర్బీఐ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం,ఈ ఏడాది జులైలో హౌసింగ్,కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్కు బ్యాంకులు ఇచ్చిన అప్పులు 38 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగాయి. హౌసింగ్ సెక్టార్కు ఇచ్చిన అప్పులు జులైలో 37 శాతం పెరిగి రూ.24.28 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్కు ఇచ్చిన అప్పులు 38 శాతం పెరిగి రూ.4.07 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. డిమాండ్ బాగుండడంతోనే రియల్ ఎస్టేట్ సెక్టార్లో లోన్ గ్రోత్ పెరిగిందని అనరాక్ చైర్మన్ అనూజ్ పురి అన్నారు. ‘ కరోనా సంక్షోభ ప్రభావం కిందటేడాది కమర్షియల్ ఆఫీస్ సెగ్మెంట్పై ఉంది. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ లేదా హైబ్రిడ్ మోడల్ను ఎంచుకోవడంపై ఆలోచించాయి. పరిస్థితులు సద్దుమణుగుతుండడంతో ఉద్యోగులు తిరిగి ఆఫీస్లకు వస్తున్నారు. క్వాలిటీ కమర్షియల్ ఆఫీస్లకు ఈ ఏడాది డిమాండ్ పెరిగింది’ అని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో దేశం మొత్తం మీద ఇండ్ల ధరలు పెరిగాయని మరో ఆర్బీఐ డేటా పేర్కొంది. ఇండ్ల ధరలను కొలిచే హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ (హెచ్పీఐ) మార్చి క్వార్టర్లో 4.6 శాతం పెరగగా, జూన్ క్వార్టర్లో 5.1 శాతం గ్రోత్ నమోదు చేసింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో 3.4 శాతం గ్రోత్ రికార్డయ్యింది.
పెరిగిన ఇండ్ల అమ్మకాలు..
కిందటేడాది దేశంలోని టాప్ ఏడు సిటీలలో హౌసింగ్ సేల్స్ భారీగా పెరిగాయని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 54 శాతం గ్రోత్ నమోదు చేశాయని అనూజ్ పురి అన్నారు. కిందటేడాది జరిగిన మొత్తం సేల్స్లో 63 శాతం వాటా ఈ ఏడాది జనవరి–జూన్లోనే జరిగాయని చెప్పారు. డిమాండ్ నిలకడగా ఉందనే విషయం తెలుస్తోందని అన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీల మెర్జర్ ప్రభావంతో రియల్ ఎస్టేట్ సెక్టార్కు బ్యాంకులు ఇచ్చిన లోన్లు ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తున్నాయని జేఎల్ఎల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమంతక్ దాస్ అన్నారు. ఈ మెర్జర్ ప్రభావాన్ని పక్కన పెడితే ఈ ఏడాది జులైలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్కు ఇచ్చిన లోన్లు ఏడాది ప్రాతిపదికన 12 %, హౌసింగ్ లోన్లు 13 % పెరిగాయని చెప్పారు.