ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడి
వెలుగు బిజినెస్ డెస్క్: ఆర్బీఐ వరసగా నాలుగోసారి బెంచ్ మార్క్ (రెపో) రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో అప్పులు తీసుకున్న వారిపై వడ్డీ భారం పెరగనుంది. దేశంలో పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చేందుకు బెంచ్ మార్క్(రెపో) రేట్లను పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ ఏడాది మే నెల నుంచి రెపో రేటును పెంచుతూ వస్తోంది. గవర్నర్ శక్తికాంత దాస్ నాయకత్వంలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ రేట్ల పెంపు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. తాజా పెంపుదలతో రెపో రేటు 5.9 శాతానికి చేరింది.
ఏప్రిల్ 2019 నుంచి చూస్తే మన దేశంలో ఇదే అత్యధికం. ఎంపీసీలో ఆరుగురు మెంబర్లుంటే, అయిదుగురు మెంబర్లు రేట్ల పెంపుదలకు అనుకూలంగా ఓట్ చేశారు. కమోడిటీస్సహా వివిధ వస్తువుల రేట్లు చుక్కలంటుతుండటంతో వాటిని కిందికి దింపే ప్రయత్నంలో భాగంగానే రెపో రేటును ఆర్బీఐ పెంచాల్సి వస్తోంది. ఎకానమి గ్రోత్కి ఇబ్బంది కలగకుండానే ధరల పెరుగుదలను అదుపులోకి తేవాలనేది ఆర్బీఐ ఆలోచన. జియో పొలిటికల్ టెన్షన్లు, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ సెంటిమెంట్ల నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ మన ఎకానమికి ఇంకా కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ఈఎంఐల భారం పెరగనుంది...
రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో లోన్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. రెపో రేటుకి నేరుగా లింక్ అయిన అప్పులపై ఈ పెంపుదల వెంటనే అమలులోకి వస్తుంది. దీంతో లోన్లు తీసుకున్న వారికి మరి కొంత బరువు మోయడం తప్పనిసరవుతుంది. ముఖ్యంగా హౌసింగ్ లోన్ల ఈఎంఐలపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతుంది. పండగ సీజన్లో కొత్తగా ఇండ్లు కొనుక్కోవాలనుకునే వారు ఆ ఆలోచనను కొంత కాలం వాయిదా వేసుకునే ఛాన్స్ ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఎఫర్డబుల్ హౌసింగ్ (రూ. 40–50 లక్షల) సెగ్మెంట్పై వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
గ్రోత్ రేటు అంచనా తగ్గింది..
గ్లోబల్పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మన ఎకానమి గ్రోత్ రేటు అంచనాలను కూడా ఆర్బీఐ సవరించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ 7 శాతం దాకా ఉండొచ్చని తాజా అంచనాలను విడుదల చేసింది. అంతకు ముందు ఈ గ్రోత్ రేటు 7.2 శాతంగా అంచనా వేశారు. 2022–23 ఫైనాన్షియల్ ఇయర్లో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ అంచనాలను మాత్రం ఆర్బీఐ మార్చలేదు. ఇది 6.7 శాతంగా ఉంటుందని గతంలోనే అంచనా వేశారు.
రెపో రేట్ల పెంపు ఎఫెక్ట్తో కార్పొరేట్లు, ఇండివిడ్యువల్స్ తాము తీసుకునే అప్పులపై ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. కార్పొరేట్లు తమ కేపెక్స్ ప్లాన్స్విషయంలో మరింత ఆచితూచి వ్యవహరించే ఛాన్స్ ఉంటుంది. -అను అగర్వాల్, కార్పొరేట్ బ్యాంకింగ్ హెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్