
Nirmala Sitharaman: భారతదేశంలో బంగారానికి డిమాండ్ బాగా ఎక్కువ. అయితే పెరుగుతున్న పసిడి ధరలు ఇతర దేశాల్లో నుంచి బంగారం స్మగ్లింగ్ సమస్యలను పెంచుతోంది. ప్రభుత్వం విధించే పన్నులను బైపాస్ చేసి భారతదేశంలోకి బంగారం తీసుకురావాలని చేసే ప్రయత్నాలను ఎల్లప్పుడూ కస్టమ్స్ అధికారులు అడ్డుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో పట్టుబడ్డ బంగారాన్ని అధికారులు ఏం చేస్తారు, దానిని ఎవరు తీసుకుంటారనే విషయాలపై మనలో చాలా మందికి అనుమానాలు ఉంటూనే ఉంటాయి.
అయితే దేశంలోకి స్మగ్లింగ్ ద్వారా వచ్చిన బంగారం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి అక్రమంగా తరలించటానికి ప్రయత్నించిన 3వేల 400 కేజీల బంగారాన్ని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ కరిగించి దానిని రిజర్వు బ్యాంకుకు అందించినట్లు ఆమె స్పష్టం చేశారు. దీనికి ముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో అధికారులు ఏకంగా 4వేల 869 కేజీల బంగారాన్ని స్మగ్లర్ల నుంచి పట్టుకుని సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
ప్రధానంగా మైన్మార్ వంటి పొరుగు దేశాల నుంచి అక్రమంగా భారతదేశంలోకి బంగారాన్ని ఎక్కువగా స్మగ్లర్లు తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని అరికట్టడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమర్స్ ప్రత్యేక కార్యచరమతో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి రంగంలోకి దిగింది. ఇలా దొరికిన బంగారాన్ని అంతిమంగా రిజర్వు బ్యాంకుకు చేర్చటం ద్వారా దానిని తిరిగి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. పైగా ఇది భారత బంగారం నిల్వలను బలోపేతం చేస్తుందని వారు చెబుతున్నారు.