
న్యూఢిల్లీ: తగ్గించిన రెపో రేటు ప్రయోజనాలను కస్టమర్లకు వీలున్నంత తొందరగా బదిలీ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను సూచించింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈ నెల ప్రారంభంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) తగ్గించిన విషయం తెలిసిందే. రేట్ల కోతకు ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
చాలా బ్యాంకులు ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో ప్రకటించిన రేటు తగ్గింపులను ఇప్పటికే తమ కస్టమర్లకు బదిలీ చేశాయి. ఎస్బీఐ , బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు అయితే జూన్ 6న ఆర్బీఐ చేపట్టిన 50 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గింపును కూడా తమ కస్టమర్లకు బదిలీ చేశాయి. దీంతో వీటి బెంచ్మార్క్ లెండింగ్ రేటుకు లింకై ఉన్న లోన్లపై వడ్డీ దిగొచ్చింది.