- రూ. 3.56 లక్షల కోట్ల నుంచి దిగొచ్చిన వాల్యూ
న్యూఢిల్లీ : వ్యవస్థలో చెలామణి అయిన 97.38 శాతం రూ. రెండు వేల నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని ఆర్బీఐ ప్రకటించింది. ప్రజలు దగ్గర ఇంకా రూ.9,330 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని తెలిపింది. రూ. 2,000 నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకుంటున్నామని కిందటేడాది మే 19 న ఆర్బీఐ ప్రకటన చేసింది. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ. రెండు వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. డిసెంబర్ 29 నాటికి వీటి విలువ రూ.9,330 కోట్లకు తగ్గింది. రూ.2,000 నోట్లు లీగల్ టెండర్గా కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది.
దేశంలోని 19 ఆర్బీఐ ఆఫీసుల్లో ఈ నోట్లను డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా ప్రజలు ఇండియా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఆఫీసులకు రూ. రెండు వేల నోట్లను పంపొచ్చు. తర్వాత ఈ డబ్బులను సంబంధిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. కాగా, ప్రజలు బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి కిందటేడాది సెప్టెంబర్ 30 వరకు టైమ్ ఇచ్చారు. ఈ డెడ్లైన్ను అక్టోబర్ 7 కి పెంచారు. ఆ తర్వాత నుంచి బ్యాంకులు రూ. 2 వేల నోట్లను తీసుకోవడం లేదు