
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని.. మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ 2023, మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ. 20 వేల వరకు మాత్రమే రూ. 2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.
మే 23 నుంచి ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్లో ఉంచొద్దని బ్యాంక్లకు ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
గత కొద్ది కాలంగా రూ. 2 వేల నోట్లు మార్కెట్లో సప్లై కావడం లేదు. రూ. 1000 స్థానంలో రూ. 2 వేల నోటును కేంద్రం తీసుకొచ్చింది. 2016లో పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి చెలామణిలో ఉన్న రూ. 2వేల నోట్లను.. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఆర్బీఐ 2019లో రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ను ఆపేసింది. 2019-20, 2020-21, 2021-22లలో రూ.2 వేల డినామినేషన్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ను సెంట్రల్ బ్యాంకు అసలు చేపట్టలేదని ఆర్బీఐ తెలిపింది. 2016-17లో 3,542.991 మిలియన్ల రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేసింది. 2017-18లో భారీగా ఈ నోట్ల సంఖ్యను తగ్గించింది. కేవలం 111.507 నోట్లను మాత్రమే ప్రింట్ చేసింది. 2018-19లో మరింత తగ్గించి 46.690 మిలియన్ నోట్లను మాత్రమే ప్రింట్ చేసినట్టు తెలిసింది.